ఆదివాసీ తనయ.. భరతమాత ముద్దుబిడ్డ
ప్రతి అడుగులో పోరాటం..
కష్టాలు, కన్నీళ్లను అధిగమిస్తూ ముందుకుసాగిన జీవిత ప్రస్థానం
భారత రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ద్రౌపదీ ముర్ము
భువనేశ్వర్,
ఆదివాసీ తనయ.. భరతమాత ముద్దుబిడ్డ
మారుమూల అటవీ ప్రాంతంలో విరబూసిన జాజిమల్లె ఆమె. ఆ పరిమళాలు కొండలు, కోనలు దాటుకుంటూ దేశ రాజధానికి చేరుకుని చరిత్ర సృష్టించాయి. భారత దేశ ప్రథమ పౌరురాలిగా హస్తినలో కొలువుదీరేలా చేశాయి. దేశాధినేతగా ఎన్నికైన ఆమె విజయ గాథ వెనుక ఎన్నో కోణాలు! కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు, సేవానిరతి, దేశభక్తి, దృఢ సంకల్పం..అన్ని మానవీయ సౌరభాలను ఒక్కచోటుకు చేర్చితే ఆమే ద్రౌపదీ ముర్ము... మన నూతన రాష్ట్రపతి.
ద్రౌపదీ ముర్ము జీవితం చీకటి, వెలుగుల ప్రస్థానం. గిరిజన జాతుల్లో గుర్తింపు లేని సంతాళీ తెగలో జన్మించిన ఆమె.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పెద్ద పోరాటమే ఉంది. పేదరికం, వెనుకబాటుతనం మధ్య పెరిగిన ముర్ము ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. ఒడుదొడుకులకు తట్టుకుని నిలబడ్డారు. సమున్నత వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు.
సచివాలయంలో చిరుద్యోగిగా..
ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా కుసుమి సమితి ఉపరబెడలోని సంతాళీ తెగలో 1958 జూన్ 20న జన్మించారు. తండ్రి బిరించి నారాయణ టుడు గ్రామ పెద్దగా ఉండేవారు. పేదరికం అవరోధంగా నిలిచినా చదువుకోవడం కోసం పరితపించారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన ముర్ముకు ఆ తర్వాత చదువును కొనసాగించేందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉన్నత విద్య కోసం భూమిని విక్రయించి భువనేశ్వర్ పంపించారు. ప్లస్టు, రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, సచివాలయం (లోక్సేవా భవన్)లో చిరుద్యోగిగా ఆమె చేరారు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామంలో తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరారు.
భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయి..
పాఠశాలలో పని చేస్తున్న సమయంలోనే మయూర్భంజ్ జిల్లా పహాడపుర్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి శ్యామచరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఇంటికే పరిమితమైన ద్రౌపదీ ముర్ము ఇద్దరు కూమారులు, ఒక కుమార్తె సంరక్షణ చూసుకుంటూ గిరిజనాభివృద్ధి ధ్యేయంగా సామాజిక సేవ చేసేవారు. కొన్నేళ్లకు కుటుంబ సమేతంగా రాయ్రంగ్పుర్ వచ్చి స్థిరపడ్డారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొన్నేళ్ల వ్యవధిలోనే చిన్న కుమారుడు, మరో ఏడాదిలో భర్త చనిపోవడం ఆమెను కుంగదీశాయి. 2009-2015 మధ్య ఆరేళ్ల సమయంలో ఈ విషాద ఘటనలన్నీ ఆమెను చుట్టుముట్టాయి. ఈ దుఃఖం నుంచి బయటకు రావడానికి ఆమెకు చాలా ఏళ్లే పట్టింది.
కౌన్సిలర్గా ఎన్నిక..
ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతూ.. సమాజసేవలో తలమునకలై ఉన్న ద్రౌపదీ ముర్ము... స్నేహితులు, సన్నిహితుల ప్రోత్సాహంతో 1997లో రాజకీయ అరంగేట్రం చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి వార్డు కౌన్సిలర్గా గెలుపొందారు. తరువాత పురాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ముర్ము అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో రాయ్రంగపుర్ నుంచి భాజపా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు బిజు జనతా దళ్, భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ముర్ముకు రవాణా, వాణిజ్య, మత్స్య, పాడి శాఖల మంత్రిగా అవకాశం దక్కింది.
విషాదం నుంచి కోలుకుని
భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయిన ద్రౌపదీ ముర్ము ఆ విషాదం నుంచి బయటపడడానికి బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. గ్రామంలో ఆలయాలకు వెళ్లి ప్రాంగణాన్ని చీపురుతో ఊడ్చేవారు. తాజా విజయంతో.. స్వాతంత్య్రానంతరం జన్మించి భారత రాష్ట్రపతి అవుతున్న తొలి మహిళగా కూడా ద్రౌపది నిలిచిపోనున్నారు.
భర్త పేరిట పాఠశాల
గిరిజన చిన్నారులు చదువుకోవాలన్న ఉద్దేశంతో పహాడ్పుర్లో భర్తపేరిట పాఠశాల ఏర్పాటు చేసి, ఉచిత బోధన అందిస్తున్నారు. భర్త, ఇద్దరు కుమారుల పేరిట ఉన్న ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన కుమార్తె ఇతిశ్రీ దీనికి సహకారం అందిస్తున్నారు.
చద్దన్నం అంటే ప్రీతి
ద్రౌపదీ ముర్ము నిరాడంబరంగా జీవించేవారని ఉపరబెడలోని బంధువులు వెల్లడించారు. చద్దన్నం చాలా ఇష్టంగా తినేవారని తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, కష్టసుఖాలు తెలుసుకునేవారన్నారు. పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించే వారని, గ్రామంలో ఉన్నన్ని రోజులు సామాన్యులతో కలిసిపోయేవారని గుర్తు చేసుకున్నారు.
జీవిత విశేషాలు
పుట్టిన తేదీ: 20.06.1958
జన్మస్థలం: ఉపరబెడ గ్రామం, ఒడిశా
విద్య: రాజనీతి శాస్త్రంలో డిగ్రీ
రాజకీయ ప్రస్థానం
1997: రాయ్రంగపుర్ కౌన్సిలర్గా ఎన్నిక
2000-2009: రాయ్రంగపుర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు భాజపా ఎమ్మెల్యేగా విజయం
2000-2004: నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రి
2006-2009: ఒడిశాలో భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు
2007: ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ ఎమ్మెల్యే (నీలకంఠ సన్మాన్) పురస్కారం
2015-2021: ఝార్ఖండ్ గవర్నర్
2022 జూన్ 21: భారత రాష్ట్రపతిగా ఎన్నిక